Water Drone: భారత నావికాదళ అమ్ములపొదిలోకి చేరిన మరో అస్త్రం..! 5 d ago

సముద్రజలాల్లో శత్రు దేశాల యుద్ధనౌకలపై ఓ కన్నేసి, నిఘాను అత్యంత సమర్థంగా నిర్వహించే అధునాతన 'వాటర్ డ్రోన్'ను రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా పరీక్షించింది. నీటిలో కాస్తంత మునిగి కనిపించకుండా దూసుకెళ్లే హై ఎండ్యూరన్స్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ (హెచ్ ఏయూవీ)ను విజయవంతంగా పరీక్షించినట్లు డీఆర్డీవో వెల్లడించింది. జలాంతర్గామిలా కనిపించే అత్యంత చిన్న స్వయంచాలిత వాహనాన్ని వాటర్ డ్రోన్గా పిలుస్తారు. ఈ పరీక్షలను సముద్ర జలాల్లో నిర్వహించింది. సముద్ర జలాల్లో పనిచేసే ఈ డ్రోన్, శత్రుదేశాల యుద్ధ నౌకలపై నిఘా పెట్టేందుకు వీలుంటుంది. దీంతో సముద్ర జలాలపై ఉపరితల నిఘా కార్యకలాపాల్లో భారత్ సామర్థ్యం మరింతగా బలోపేతం కానుంది.
వాటర్ డ్రోన్ ప్రత్యేకత
ఈ వాటర్ డ్రోన్ ను డీఆర్డీవో ప్రధాన పరిశోధన విభాగం "నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లాబొరేటరీ" (NSTL) అభివృద్ధి చేసింది. వాటర్ డ్రోన్ బరువు 6 టన్నులు, పొడవు 9.75 మీటర్లు. శత్రువుల యుద్ధనౌకల సిబ్బంది కంట్లోపడకుండా నీటి ఉపరితలంపై పెద్దగా అలల అలజడి సృష్టించకుండా నిశ్శబ్దంగా, మెల్లగా ముందుకెళ్తుంది. గరిష్ఠంగా గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం ఉంది. శత్రుదేశాల నౌకలకు కనిపించకుండా దాక్కోవాల్సిన పరిస్థితుల్లో సముద్రజలాల్లో ఏకంగా 300 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. సమీపంలో సంచరించే భారత జలాంతర్గాముల రక్షణ, అన్వేషణ సామర్థ్యాలను సైతం ఈ వాటర్ డ్రోన్ మెరుగుపరుస్తుంది.